వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా ధర్నా నిర్వహిస్తోంది.ఈ ధర్నా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది.
ఈ ధర్నాలో కేసీఆర్తో సహా మంత్రులంతా స్టేజి పైన కూర్చొని ఉండగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్టేజ్ మీదకు వెళ్లకుండా జనం మధ్యలో కూర్చోని నిరసన తెలుపుతున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులను అంకరించుకొని.. భుజంపై నాగలి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ ధర్నాలో సీఎం కేసీఆర్తో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి, మల్లారెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగుల, సబిత, సత్యవతీ రాథోడ్, కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇందిరాపార్క్ వద్దకు భారీగా తరలి వచ్చారు. మహాధర్నా తరువాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి సీఎం కేసీఆర్ వినతి పత్రం ఇవ్వనున్నారు.