వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో మేరకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చేపట్టారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతుల మహాధర్నాకు సంఘీభావంగా వచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం తెలిపారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని అన్నారు.
రైతుల ప్రయోజనాలు చేకూరే వరకు ఆందోళనలు చేస్తామని, ఉత్తరాది రైతులతో కలిసి కేంద్రంపై పోరాడతామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పంజాబ్లో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని స్వయంగా కోరినట్లు చెప్పారు. ప్రధానికి లేఖ రాసిన ఉలుకు లేదు పలుకు లేదని విమర్శించారు. ఇది ఈ రోజుతో ఆగేది కాదని…కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగబోదన్నారు. మోదీ సర్కార్ దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు ధర్నాలుచేస్తామని అన్నారు.