ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తిచేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కోడెల అంత్యక్రియలు రేపు (బుధవారం) గుంటూరు జిల్లాలోని ఆయన స్వస్థలమైన నరసరావుపేటలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కోడెల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్న కోడెల పార్థివదేహాన్ని నేడు విజయవాడ మీదుగా మంగళగిరికి తరలిస్తారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో రెండు గంటలపాటు ఉంచి సందర్శకులను అనుమతిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుంచి నరసరావుపేట తరలిస్తారు.