ఇంటర్నెట్ సేవలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ పలు విషయాలు వెల్లడించారు ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…భారత్ సహా ప్రపంచం మొత్తం 5జీని అభివృద్ధి చేస్తుంటే దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్ఫోన్ వాడుతూ ప్రాథమిక ఇంటర్నెట్ సేవలకు దూరంగానే ఉన్నారని అన్నారు. దేశంలో 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
1995లో దేశంలో మొబైల్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో పురోగతి సాధించామని చెప్పారు.అప్పట్లో కాల్ చేసినవారు నిమిషానికి రూ.16 చెల్లించాల్సి వచ్చేదని అలాగే కాల్ రిసీవ్ చేసుకున్న వారు నిమిషానికి రూ.8 చెల్లించాల్సి వచ్చేదని గుర్తు చేశారు.
ఇప్పుడు 4జీ కాల్స్ ఉచితంగా చేసుకుంటున్నారని చెప్పారు. మొబైల్లోనే వార్తలు చదువుకోవచ్చని, వీడియోలు చూడటం, వస్తువుల కొనుగోళ్లు చేయడం వంటి సేవలు కూడా సామాన్యులకు అందుతున్నాయని చెప్పారు. మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారని తెలిపారు.