పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ప్రతీ ఏటా నిమజ్జనం రోజు భారీ గణపయ్యని చూసేందుకు వేలాది మంది తరలివస్తారు. నగరం నలుమూలల నుంచే కాదు.. పక్క జిల్లాల నుంచీ గణేషుడిని చూసేందుకు వస్తారు.
నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు వేలామంది ప్రజల సమక్షంలో పంచముఖ రుద్ర మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్బండ్ వరకు సాగింది. ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు.
ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగింది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ట్యాంక్బండ్పై తుదిపూజల అనంతరం హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేశారు. గణపతిబప్పా మోరియా నినాదాలతో హోరెత్తించారు. బైబై గణేషా అంటూ వీడ్కోలు పలుకుతున్నారు.