telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేబీసీలో పాల్గొన్న తెలంగాణ టీచర్… ఆమె కథ విని చలించిన బిగ్ బీ

KBC

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ). ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అమితాబ్‌ తిరిగి షూటింగుల్లో పాల్గొంటున్నారు. ‘కౌన్‌ బనేగా కరోర్‌పతి’ 12వ సీజన్‌ స్టార్ట్ అయిపోయింది. దేశవ్యాప్తంగా పాపులరైన ఈ షోలో తెలంగాణ నుంచి సబితా రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో ఆమె టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఎప్పుడూ సరదా సరదాగా షోను నడిపించే బిగ్ ‌బీ సబితా లైఫ్‌ జర్నీ గురించి తెలుసుకుని చలించిపోయారు. భర్తను కోల్పోయి, పిల్లలను పెంచి పెద్ద చేసిన తీరు పట్ల ఆయన ప్రశంసలు కురింపిచారు. స్ఫూర్తిమంతమైన జీవన ప్రయాణమని అమితాబ్‌ కొనియాడారు. ఒక టీచర్‌గా పిల్లలకు మంచి విద్యను అందిస్తానని సబిత చెప్పుకొచ్చారు. జీవితంలో పిల్లలకు ఆస్తులు ఇవ్వకున్నా కానీ, మంచి విద్యను అందివ్వాలని చెప్పారు. ఆమె పాల్గొన్న కేబీసీ సీజన్‌ 12, ఆరో ఎపిసోడ్‌ సోనీ టీవీలో నేటి రాత్రి (మంగళవారం) ప్రసారమవనుంది. ప్రస్తుతం సోనీ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఈ ఎపిసోడ్‌ అందుబాటులో ఉంది. ఇక కేబీసీ సీజన్‌ 12, ఆరో ఎపిసోడ్‌లో సబితారెడ్డితో పాటు మరో 7 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. కంటెస్టెంట్‌ ప్రదీప్‌కుమార్‌ సూద్‌ బిగ్‌ బీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి 12.5 లక్షల ప్రైజ్‌ మనీ గెలుచుకుని ఆట నుంచి పక్కకు తప్పుకున్నారు. కేబీసీలో పాల్గొనడం తన తల్లి కోరిక అని ప్రదీప్‌ చెప్పారు. ఆమె కల నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రదీప్‌ తర్వాత సబితారెడ్డి కేబీసీ క్విజ్‌లో పాల్గొన్నారు.

Related posts