telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించాము: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది.

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించినట్టు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

డిసెంబర్ 16వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,96,854 మంది రైతుల నుంచి ఏకంగా 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.

దీని విలువ సుమారు రూ.5,938.20 కోట్లు ఉంటుందని, రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటికే అత్యధిక భాగం చెల్లింపులు పూర్తి చేశామన్నారు.

ఇప్పటివరకు 3,79,538 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.5,682.77 కోట్లు జమ చేసినట్టు వివరించారు.

మిగిలి ఉన్న రూ.255.43 కోట్ల బకాయిలను కూడా తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెసింగ్‌లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తోందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతుల సౌకర్యార్థం 3,500 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి, సరైన ప్రతిఫలం పొందాలని సూచించారు.

Related posts