అధికారులు ప్రస్తుత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ యాప్లతో నగర ప్రజలకు సేవలందిస్తున్నారు, అదే తరహాలో పాస్పోర్ట్ విచారణ ప్రక్రియ సైతం మూడు రోజుల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. ‘వెరీఫాస్ట్’ పేరుతో తయారుచేసిన సాప్ట్వేర్ సాయంతో హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ వేగాన్ని అందుకున్నారు. నగరంలో దరఖాస్తుదారు ఎక్కడున్నా సరే ఇంటికి వెళ్లి విచారణ ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం వారు చెప్పిన వివరాల్లో నిజానిజాలను నిర్ధరించుకుని నివేదికను ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి పంపుతున్నారు. విచారణ ప్రక్రియను దరఖాస్తుదారులు తెలుసుకునేందుకు వీలుగా ముఖాముఖి స్పందన వ్యవస్థ(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేక పోలీసు విభాగం అధికారులు, సిబ్బందికి ఇతర విధులు చాలా ఉన్నా పాస్పోర్టు ప్రాధాన్యం దృష్ట్యా ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు ఇలా చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇప్పటివరకు ఒక దరఖాస్తును 21 రోజుల్లో పూర్తిచేయాల్సి ఉండేది. వేల సంఖ్యలో వస్తున్నవాటితో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యేవారు. సేవాకేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్పోర్టు దరఖాస్తుదారుల వద్దకు వెళ్తున్న విచారణ సిబ్బందికీ మార్కులు ఇస్తామంటూ ఉన్నతాధికారులు చెప్పారు. పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు వారి పనితీరు, ప్రవర్తన ఆధారంగా కాల్సెంటర్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు మార్కులు కేటాయిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెలకు సగటున 90 మందికి ఇలా మార్కులిస్తున్నారు. దరఖాస్తుల సంతృప్తి శాతాలను సమీక్షించి ఎవరైనా దురుసుగా ప్రవరిస్తే వారి ప్రవర్తన సరిచేసుకోవాలంటూ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. విచారణకు వెళ్లేవారు డబ్బులు తీసుకున్నా, బహుమతులు స్వీకరించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.