ఎన్నికల సందడి మొదలు కావటంతో అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు చేరిపోయారు కూడా. అయితే ఈ వలస వాదులతో ప్రచారంలో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుత పార్టీకి కాకుండా పొరపాటున పాత పార్టీకి జై అంటున్నారు అభ్యర్థులు. కాసేపు సభకు హాజరైన ప్రజలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇదే తంతు అన్ని సభలలో కూడా. తాజాగా, “జై కేసీఆర్… జై తెలుగుదేశం”… ఇలా అన్నది ఎవరో తెలుసా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మల్కాజిగిరి ఎన్నికల ఇన్ చార్జి సుధీర్రెడ్డి.
మేడ్చల్ లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో తన ప్రసంగాన్ని ముగించిన తరువాత, “జై కేసీఆర్… జై తెలుగుదేశం” అనేసి తన కుర్చీలో కూర్చుండి పోయారాయన. టీఆర్ఎస్ శ్రేణులు నవ్వుతుంటే, ఏం జరిగిందో తెలుసుకుని తిరిగి మైకందుకుని, “జై కేసీఆర్…జై తెలంగాణ” అన్నారు. ఆ సమావేశం తరువాత సుధీర్ రెడ్డిని చుట్టుముట్టిన మీడియా, మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారా? అని ప్రశ్నించగా, “ఏదో అలవాటులో పొరపాటుగా వచ్చింది. ఇంకా ఆ పార్టీలోకి ఎవరు వెళ్తారు?” అని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని, పార్టీకి కట్టుబడి పని చేస్తానని చెప్పారు.
సునీత ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు