ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 101లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మంజునాథ రెడ్డి అప్పుడప్పుడు ఈ ఫ్లాట్ కి వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్తుంటారు మూడు రోజుల కిందట ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం శవమై కనిపించారు.
మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్రెడ్డి వైసీపీలో ఉన్నారు. అంతేకాకుండా పీఎంఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.
మంజునాథరెడ్డి భార్య స్రవంతి డాక్టర్గా పనిచేస్తున్నారు. కుమారుడి మృతిపై సమాచారం అందిన వెంటనే ఆయన విజయవాడకు బయలుదేరారు.
కాశ్మీర్తో పాటు పలు రాష్ట్రాల్లో చేసిన పనులకు గాను రాంకీ సంస్థ నుంచి తమ కంపెనీకి బిల్లులు రావాల్సి ఉందని… బ్యాంకుల నుంచి సకాలంలో ఫైనాన్స్ అందలేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తన కుమారుడు కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు.
మంజునాథ్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన మృతదేహం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో ఉంది.