సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది.
సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. దీంతో ఆయన పేరును ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.
కాగా ఈ నెల 26వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ లలిత్ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు.
ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. న్యాయమూర్తి కంటే ముందు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన 6వ సీనియర్ న్యాయవాది.
దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యూయూ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. ఆయన సీజేఐ అయితే బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తి అవుతారు.
1957 లో జన్మించిన ఆయన.. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1983 జూన్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. అనంతరం 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
.