కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కశ్మీర్ సమస్య పై మాట్లాడుతూ, అతి త్వరలోనే పరిష్కరిస్తామని, అందుకు తమను ఏ శక్తీ అడ్డుకోలేదని పేర్కొన్నారు. సరిహద్దు రోడ్డు రవాణా సంస్థ నిర్మించిన ఉజ్ వంతెన ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరిద్దామనుకుంటే కొందరు అందుకు అంగీకరించడం లేదని అన్నారు. అయినా సమస్యను ఎలా పరిష్కరించాలో తమకు తెలుసని ఆయన అన్నారు. కశ్మీర్లో ఎవరైతే ఉద్యమబాట పట్టారో వారు సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే చర్చలకు రమ్మని ఆహ్వానిస్తున్నాం.. అని అన్నారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
పాక్ తరచూ కాల్పుల ఉల్లంఘన కు పాల్పడటం గురించి ప్రశ్నించగా.. నరేంద్రమోదీ నాయకత్వంపై, సైనికాధికారులపై విశ్వాసం ఉంచండి. మేము మీ నమ్మకాన్ని ఎప్పటికీ ఉల్లంఘించమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంతెన నిర్మాణం బాగా చేశారని బీఆర్వో సంస్థను ప్రశంసించారు. ఈ వంతెన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమానికి ముందుగా 1999 సంవత్సరంలో పాక్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు.