అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. స్వాతంత్ర్యం అనేది ప్రాణవాయువు వంటిదని మహాత్మా గాంధీ చెప్పారని జగన్ అన్నారు. సమాజంలో సమానత్వం అన్న పదాన్ని పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకూడదని అన్నారు.
ఆంధ్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో విద్యలో పోటీ పడేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. రైతు భరోసా ద్వారా అన్నదాతలకు సాయం అందిస్తున్నామని చెప్పారు. పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని తెలిపారు.రైతు భరోసా, పెన్షన్ కానుక, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, కంటి వెలుగు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ భేదాలకు అతీతంగా నవ రత్నాలు అందిస్తున్నామని చెప్పారు.