ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసేందుకు తగిన వేదికను ఎంపిక చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని హైలెవల్ కమిటీ పేర్కొంది. మొదట చినఅవుటపల్లి వద్ద ఓ ప్రాంతంలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని భావించినా, జగన్ తాను విజయవాడలోనే ప్రమాణస్వీకారం చేస్తానని స్పష్టం చేయడంతో అధికారులు తగిన వేదిక కోసం అన్వేషించారు.
చివరికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. ఇక్కడ దాదాపు 50,000 మంది వరకు కూర్చునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్ ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.