telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

22 ఏళ్ల తరువాత ఫలించిన భర్త పోరాటం… సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Supreme Court

హైదరాబాద్‌కు చెందిన ఈ దంపతులకు1993లో వివాహం అయ్యింది. పెళ్లైన రెండేళ్లకు వీరికి సంతానం కలిగింది. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 1997లో మహిళ తన పుట్టింటికెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత సదరు భర్త 1999లో విడాకుల కోసం హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. భార్య మాత్రం విడిపోవడానికి అంగీకరించకపోవడంతో ఫ్యామిలీ కోర్టులో ఆయనకు విడాకులు మంజూరు కాలేదు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తలుపుతట్టారు. అక్కడ కూడా చుక్కెదురవడంతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఎన్నో మలుపులు తిరిగి కాపురం చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో, సుప్రీంకోర్టు తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకుని వీరి వివాహాన్ని రద్దుచేస్తూ బుధవారం విడాకులు మంజూరు చేసింది. భార్యకు మనోవర్తి కింద రూ.20 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

కాగా, వైవాహిక బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా ఉంటున్నప్పుడు విడాకులకు ఇద్దరు సమ్మతించాలి. అలా కాకుండా ఒకరు వ్యతిరేకిస్తే విడాకులు మంజూరు చేయడం అసాధ్యం. ఇదే అంశంపై లా కమిషన్ కూడా కేంద్రానికి గతంలో సూచనలు చేసింది. కాపురం చక్కదిద్దడానికి వీలులేని పరిస్థితులు ఉంటే తక్షణమే విడాకులు ఇచ్చేలా చట్టంలో సవరణ చేయాలని 1978, 2009లో లా కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను అమలుచేయడంలో కేంద్రం విఫలమైంది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సక్రమించిన అధికారాలను సుప్రీంకోర్టు వినియోగించుకుంటోంది. దంపతులిద్దర్నీ కలిపి ఉంచడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మహిళల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ఆమెకు శాశ్వతంగా ఏక మొత్తంలో మనోవర్తిని ఇప్పించడానికి అనువైన కేసుగా భావిస్తున్నామని జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఆర్ షాల ధర్మాసనం తెలిపింది. భార్యాభర్తల మధ్య మానసికంగా బంధం విచ్ఛిన్నమైందని కోర్టు అభిప్రాయపడింది. 22 ఏళ్లుగా విడిపోయిన ఉన్న దంపతులు తిరిగి కలిసుండటం అసాధ్యమని పేర్కొంది. అందుకే ఆర్టికల్ 142లోని అధికారాలను ఉపయోగించిన విడాకులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

Related posts