కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ. 2.50 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ. 50 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దీన్ని ఏకంగా రూ. 2.50 లక్షలకు పెంచారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ ప్రోత్సాహకం పొందాలనుకునే పెళ్లి జంట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వధూవరుల ఫొటోలు, ఇద్దరి కుల ధ్రువీకరణ పత్రాలు, వయసు ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రం, వధూవరుల బ్యాంక్ జాయింట్ అకౌంట్ వివరాలు, పెళ్లికి సాక్షులుగా ఉన్న వారి వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది.