తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల బాధలు జోక్ లా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. అధికారం చేతిలో ఉంది కదా అని కేసీఆర్ ఏంచేసినా చెల్లుతుందని అనుకోవడం దురదృష్టకరం అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. దేశంలో ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచేలా ఆగస్టు 15 నుంచి అసలు పాలన మొదలవుతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో అసలు పాలన జరగలేదన్న విషయం తెలుస్తోందని విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఎంతటి దుస్థితి దాపురించిందో అర్థమవుతోందన్నారు.
విపక్షాలు నిరసనలను కూడా జోక్ గా తీసుకునే కేసీఆర్ కు చివరికి న్యాయస్థానం ఆదేశాలు కూడా పరిహాసంగానే ఉంటాయని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలు కూలుస్తామని కేసీఆర్ సర్కారు చెబుతోందని, ఎర్రమంజిల్ లో ఉన్న గెస్ట్ హౌస్ ఓ సాంస్కృతి భవనం అని తెలిసినా దాన్ని కూడా కూలుస్తామనడం కేసీఆర్ కే చెల్లిందని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో ఎర్రమంజిల్ అతిథి గృహం కూడా అక్రమకట్టడంలానే కనిపిస్తోందని ధ్వజమెత్తారు.