ఈరోజు ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 121 రేటింగ్ పాయింట్లతో భారత్ నంబర్వన్ ర్యాంకును పదిలం చేసుకోగా.. 120 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముంగిట భారత జట్టుకి ఇది ఉత్సాహానిచ్చే వార్త అని చెప్పాలి. భారత్ మొత్తంగా 24 మ్యాచుల్లో 2914 పాయింట్లు అందుకొంది. మరోవైపు న్యూజిలాండ్ 18 టెస్టులాడి మొత్తం 2166 పాయింట్లు సంపాదించింది. ఆసీస్పై 2-1, ఇంగ్లండ్పై 3-1 తేడాతో గెలవడం కోహ్లీసేనకు ఉపయోగపడింది. వెస్టిండీస్, పాకిస్థాన్పై 2-0 తేడాతో సిరీసులు గెలవడం కివీస్ను ముందుకు తీసుకొచ్చాయి. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ (109) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. ఒక స్థానం తగ్గిన ఆస్ట్రేలియా (108) నాలుగుకు పడిపోయింది.
previous post