గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ రోజు భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె లడఖ్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుందని అధికారులు తెలిపారు. భద్రతతో పాటు అక్కడి పరిస్థితులను నరవాణె సమీక్షించనున్నారు.
సమస్య పరిష్కారానికి నిన్న ఉన్నత స్థాయి ఆర్మీ అధికారులు 11 గంటల పాటు చర్చించారు. భారత్ నుంచి కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. నిన్న భేటీ అసంపూర్తిగానే ముగిసినట్లు తెలిసింది. గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల మేజర్ జనరల్ స్థాయి సైనికాధికారులు చర్చలు జరపడం ఇది రెండో సారి. చర్చల ఫలితాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. గాల్వన్ లోయ నుంచి తిరిగి వెళ్లేందుకు చైనా అంగీకరించట్లేదని సమాచారం.