telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

నేను మొదట్లో సీఎంగా ఉన్నప్పుడు ఐఐటీల్లో మన విద్యార్థు ల సంఖ్య పెంచాలని విద్యావేత్త చుక్కా రామయ్యను పిలిపించి మాట్లాడాను: ముఖ్యమంత్రి చంద్రబాబు

తాను నిత్య విద్యార్థిని అని, ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కొత్తగా నేర్చుకున్న విషయాల ద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందా అని నిత్యం ఆలోచిస్తానన్నారు.

అలాగే బోధనలోనూ అనేక మార్పులు రావాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనావిధానం మారాలని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. 175 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానంచేశారు.

అనంతరం వారిని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘‘గురువులకే గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్‌. నేను తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ విధిగా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నాను.

ఉత్తమ టీచర్లు ఈ సభలో పలు సూచనలు చేశారు. వాటిని ఒక పుస్తకంగా తీసుకొస్తాం.’’ అని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…

‘‘ఒకప్పుడు నేను ఐటీ అంటే ఎగతాళి చేశారు. నేను మొదట్లో సీఎంగా ఉన్నప్పుడు ఐఐటీల్లో మన విద్యార్థులు చాలా తక్కువగా ఉండేవారు. వారి సంఖ్య పెంచాలని విద్యావేత్త చుక్కా రామయ్యను పిలిపించి మాట్లాడాను.

ఆయన 10వేల మందికి పరీక్ష పెట్టి 100 మందిని ఎంపిక చేస్తారు. అందరూ ఐఐటీల్లో సీట్లు సాధిస్తారు. ఆయన ఇన్‌స్టిట్యూట్‌లో సీట్లు కావాలని కొందరు నన్ను అడిగేవారు.

ఆయనకు ఫోన్‌ చేసి అడిగితే ఏమైనా అడగండి కానీ సీటు మాత్రం అడగొద్దని ఖరాఖండీగా చెప్పారు. అలా అంటే సీఎంలుగా ఉండేవాళ్లకు కోపం వస్తుంది. కానీ నాకు ఆయనపై గౌరవం పెరిగింది’’.

‘‘ప్రతి పాఠశాలలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఏర్పాటుచేసుకోవాలి. పూర్వవిద్యార్థులను అందులో మమేకం చేయాలి. బదిలీల్లో కౌన్సెలింగ్‌ ప్రవేశపెట్టి టీచర్ల గౌరవం పెంచాం.

నా పాలనలో టీచర్లు, ఉద్యోగులకు ఇబ్బందులు ఉండవు. పరిశ్రమలకు ఏది అవసరమో సిలబస్‌ అలా మారాలి..’’

ఉపాధ్యాయ దినోత్సవంలో చంద్రబాబు నవ్వులు పూయించారు. మంత్రి లోకేశ్‌కు ఎంత ఎక్కువగా టెక్నాలజీ తెలిసినా తనతో పోటీ పడలేరని సరదాగా వ్యాఖ్యానించారు.

మనవడు దేవాన్ష్‌ మాట్లాడేది తనకు అర్థంకావట్లేదని, అంత స్పీడ్‌గా ఉన్నాడన్నారు. ‘‘మన కంటే ఇతర రాష్ర్టాలు ముందుంటే నేను సహించలేను.

నాకు అసూయ. అందుకే రాష్ర్టాన్ని నంబర్‌ వన్‌గా నిలపడానికి నిరంతరం పనిచేస్తుంటాను.’’ అని సీఎం వ్యాఖ్యానించడంతో అందరూ గట్టిగా నవ్వారు.

Related posts