telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

రాగులు తీసుకెళ్తే ఏకంగా జైలుకు…!?

Abu-Dabhi

ఎండకాలంలో చల్లటి రాగి అంబలి తాగినా.. రాగి పిండితో చేసిన వంటకాలు తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎడారి దేశం గల్ఫ్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఆ హైదరాబాదీ ఇలాగే ఆలోచించాడు. రెండు కిలోల రాగులను వెంటబెట్టుకొని విమానం ఎక్కాడు. ఇదే ఆయన చేసిన నేరమైంది. ఈ చిరుధాన్యాలను గల్ఫ్‌కు తేవడాన్ని అక్కడి కస్టమ్స్‌ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వివరాల్లోకి వెళ్తే… అంబర్‌పేట మారుతీ నగర్‌వాసి కట్టకపు సంతోష్‌రెడ్డి యూఏఈలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. వెంట 2కిలోల బరువున్న నాలుగు రకాల రాగులను హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. అబుదాబి విమానాశ్రయంలో సంతోష్‌ లగేజీని తనిఖీ చేసిన అధికారులు.. అతడి వద్ద రాగులు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌రెడ్డి బావమరది, బంధుమిత్రులు కూడా దుబాయిలోనే పని చేస్తున్నా.. కొన్ని చిరుధాన్యాలపై నిషేధం ఉందన్న సంగతి వారికీ తెలియదు. నిషేధిత దినుసులతో పట్టుబడితే గల్ఫ్‌లో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. వీసా రద్దు చేసి దేశం నుంచి బహిష్కరిస్తారు. సంతోష్‌రెడ్డి విడుదలకు సహకరించాలని ఆయన భార్య అనిత అబుదాబిలోని భారత ఎంబసీ, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సంతోష్‌రెడ్డి తీసుకొచ్చిన రాగులను కస్టమ్స్‌ అధికారులు ల్యాబ్‌కు పంపించారని, నివేదిక వచ్చిన తర్వాత కేసులో స్పష్టత వస్తుందని సమాచారం. వాస్తవానికి గసగసాలపై గల్ఫ్‌లో నిషేధం ఉంది. అలాగే పచ్చళ్లు, వడియాలు, అప్పడాల వంటి ఆహార పదార్థాలు, కప్ప, పంది మాంసం, జంతువుల రక్తంతో వండిన పదార్థాలు, డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా తీసుకెళ్లే మందులపై నిషేధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు.

Related posts