కేంద్ర ఎన్నిక సంఘం ఏపీ ఉన్నత పోలీస్ అధికారులకు షాక్ ఇచ్చింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్, చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్, గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, విజయనగరం ఎస్పీ దామోదర్, అడిషనల్ సీఈవో సుజాత శర్మ, ఓఎస్డీ యోగానంద్లు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ముగ్గురు ఐపీఎస్లను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో పాటు శ్రీకాకుళం ఎస్పీని ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీల స్థానంలో వారి తర్వాత సీనియర్లుగా ఉన్న అధికారులుగా నియమించాలని ఆదేశించింది. వీరికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని సూచించింది.