హుజురాబాద్ ఉప ఎన్నికకు ప్రచారానికి చివరి రోజు కావడంతో నాయకులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఓటర్లను తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ ఓటుకు రూ.20 వేలు ఇస్తుందని రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. మా ముఖ్యమంత్రి సభ పెట్టకుండా చేశారు. బండి సంజయ్ మాత్రం సభ పెట్టుకున్నారు. రైతు నాగలి గుర్తు నుండి నేటి వరకూ టీఆర్ఎస్ గెలుస్తూనే ఉందన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ ను ప్రజలు ఆశీర్వదించారు. హుజూరాబాద్లో తెరాసదే గెలుపని సర్వేలన్నీ తెలిపాయి. ఓటమి ఖాయమని తెలిసి ప్రస్టేషన్తో కొంతమంది ఫోన్లు పగలకొడుతున్నారట అంటూ ఎద్దేవా చేశారు. గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టు కారుకు ఓటు వేయండి అంటూ హరీష్ అన్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులు ఏం చేస్తారో చెప్పాలని, 30వ తేదీ తరువాత గ్యాస్ ధర రూ. 200 వరకు పెంచుతారట అని అన్నారు. గ్యాస్ ధర పెంచం, సబ్సిడీ ఇస్తాం అని చెప్పి ఓట్లు అడగాలని ఆయన కేంద్ర మంత్రులను డిమాండ్ చేశారు. ఉజ్వల్ పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చారని.. నెలనెలా గ్యాస్ ధరలు పెంచారని విర్శించారు. సబ్సిడీలు ఎత్తేశారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టు కారుకు ఓటు వేయండి అంటూ ప్రజలకు కోరారు.
ఈటల రాజేందర్ పట్ట పగలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని , ఈటలకు ఆత్మగౌరవం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఆత్మగౌరవం కల్పించింది సీఎం కేసీఆర్ అని హరీష్ రావు గుర్తు చేశారు. బీజేపీలో చేరి హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ను వీడి ఢిల్లీ పెద్దల ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. అన్నం పెట్టి పెంచిన కేసీఆర్ ను తిట్టడం రాజేందర్ కు తగదని చాలా మంది సామాన్యులు అన్నారని హరీశ్రావు అన్నారు..
ఏడేళ్ల టీఆర్ఎస్ ఏం చేసిందో.. ఏడేళ్లలో బీజేపీ ఏం చేసిందో చర్చిద్దాం అంటే ముందుకు రాలేదని, సరుకు లేకనే నోరు జారుతున్నారని అన్నారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి అని హరీష్ కోరారు