నిన్నమొన్నటిదాకా… గిట్టుబాటుధరతో అమ్ముడుబోయిన ఉల్లిపాయలకు రేటు లేదని ఓ రైతు ఆవేదనాభరితుడయ్యాడు. మొన్నటి వరకు వినియోగదారుల కంట కన్నీరు పెట్టించిన ఉల్లి.. ప్రస్తుతం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని ఓ రైతు ఆగ్రహించి తాను పండించిన పంటకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది.
కర్నూలు మార్కెట్లో దళారులు, వ్యాపారస్తులు కుమ్మకై గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్నూలు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు తను తీసుకొచ్చిన ఉల్లిపాయల బస్తాలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. పంచలింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఉల్లిని విక్రయించేందుకు కర్నూలు మార్కెట్కు తీసుకొచ్చాడు.
ఈ-నామ్ పద్ధతిలో క్వింటా 350రూపాయల ధర పలకడంతో ఆగ్రహించిన రైతు ఉల్లి బస్తాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు క్వింటాకు 700రూపాయలు ఇప్పిస్తామని ప్రకటించడంతో రైతులు శాంతించారు. ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోవడమే రైతు ఆగ్రహానికి కారణం. కనీసం ఉల్లి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
చంద్రబాబుకు పట్టం కట్టేందుకే మహిళలు: బొండా ఉమ