ఢిల్లీలోని మంద్క ప్రాంతంలో భారీగా ప్లైవుడ్ గోదాములు ఉన్నాయి. ఇందులోని ఓ గోదాములో ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంత ప్రజలు పరుగులు తీశారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రాణనష్టం ఏమీ లేకున్నా భారీ మంటల్ని అదుపు చేసేందుకు 21 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది శ్రమిస్తున్నారు.
భారీగా మంటలు ఎగసి చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది శకటాలతో ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే మంటలు ఆర్పడం వారి వల్ల సాధ్యం కాకపోవడంతో సమీపంలో ఉన్న అన్ని అగ్నిమాపక కేంద్రాలకు కూడా సమాచారం అందించారు.
దీంతో మొత్తం 21 శకటాలతో సిబ్బంది ప్రస్తుతం ఘటనా స్థలిలో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఎదురుగా ఉన్న బల్బుల కంపెనీకి విస్తరించకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గత ఆదివారం అనాజ్ మండీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 43 మంది చనిపోయిన విషయం తెలిసిందే.