*జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
*రేవంత్ రెడ్డిపై పోలీసులకు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్లో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయ ఆవరణలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
దేవాలయంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని విష్ణు స్పష్టం చేశారు. రేవంత్ వ్యాఖ్యలు తప్పని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
నిరాధార ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు విష్ణువర్ధన్ రెడ్డి. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతగా కాకుండా, పెద్దమ్మ తల్లి ఆలయం ఫౌండర్ గా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. మైనర్ బాలిక రేప్ ఘటన పెద్దమ్మ గుడి వెనకాల ఉన్న కాలనీలో జరిగిందని పోలీసులు కూడా నిర్ధారించారని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి సరైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.