నాల్గవదశ ఎన్నికలలో కూడా ఈవీఎం లు మొరాయిస్తున్నాయి. యూపీలోని 13 సీట్లకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లు మొరాయిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడి అక్బర్పూర్లోని బూత్ నంబర్ 244లో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 8 గంటలవరకూ పోలింగ్ ప్రారంభం కాలేదు. అలాగే బీతర్ గ్రామంలోనూ ఈవీఎంలు చెడిపోవడంతో గంటల తరబడి ఓటర్లు లైన్లలో నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడింది.
కాన్పూర్ లోని బర్రాలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు చెడిపోవడంతో ఓటర్లు అధికారులతో గొడవకు దిగారు. దీంతో ఎస్పీ రవీనా త్యాగీ నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను శాంతింపజేశారు. అధికారులు ఇక్కడకు ఇతర ఈవీఎం యంత్రాలను తీసుకువచ్చారు. కాగా మొహమ్మద్పూర్ నర్వల్ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ప్రధానమంత్రి ప్రకటించిన పథకాలు అందకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.