శ్రీకాకుళం ఏజెన్సీలో గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి వేళల్లో గ్రామాలపై పడుతూ ప్రాణాలు తీస్తున్నాయి. పండిన పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గత 12 ఏళ్లలో ఏనుగుల దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపధ్యంలో అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
ఒడిసాలోని లఖేరి అటవి ప్రాంతం నుంచి ఏపీలోకి వచ్చిన ఏనుగులు ఏళ్లతరబడి ఇక్కడే తిరుగుతున్నాయి. రెండు ఏనుగుల గుంపులు ప్రస్తుతం శ్రీకాకుళం అటవి శాఖ అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే ఏనుగులను నియంత్రించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా అది ఫలితాలు ఇవ్వలేదు. రాత్రి వేళల్లో గ్రామాల్లోకి రావడంతో గిరిపుత్రులు వణికిపోతున్నారు. ఒక్కో సమయంలో మైదాన ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.