చాలా మందికి పాలు అంటే గేదెపాలు లేదా ఆవుపాలు, ఇంకా కాస్త తెలిసినవారికి మేకపాలు తెలుసు. కానీ, గాడిద పాలు నిజానికి చాలా మంచివని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయట. అందువల్లే ఢిల్లీలోని ఓ స్టార్టప్ కంపెనీ గాడిద పాలతో సబ్బులను తయారు చేసి విక్రయిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
గాడిద పాలతో తయారు చేసిన సబ్బులను ఢిల్లీకి చెందిన ఆర్గానికో అనే ఓ స్టార్టప్ కంపెనీ అమ్ముతూ తక్కువ కాలంలోనే పేరు గడించింది. పూర్వం ఈజిప్టు మహారాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇలా గాడిద పాలను స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది కూడా. అందుకనే ఆర్గానికో కంపెనీ గాడిద పాలతో ఆర్గానిక్ సబ్బులను తయారు చేసి విక్రయిస్తూ ఖ్యాతి గడిస్తున్నది.
మన చర్మానికి గాడిదపాల వల్ల అంత త్వరగా వృద్ధాప్య చాయలు రావట. అంటే ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉంటారన్నమాట. అలాగే గాడిద పాలు చర్మానికి కాంతిని అందిస్తాయి. చర్మం మృదువుగా మారేలా చూస్తాయి. అందుకనే ఇప్పుడు ఈ పాలతో తయారు చేయబడిన సబ్బులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని ఆర్గానికో సంస్థ వ్యవస్థాపకురాలు పూజా కౌల్ చెబుతున్నారు. గాడిద పాలలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయని, ఇవి మొటిమలను తగ్గిస్తాయని, చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయని పూజా చెబుతున్నారు.
ఈ సబ్బులకు మంచి డిమాండ్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గాడిద పాల సబ్బులకు ఉందట. ఈ ప్రాంతాల్లోని పలువురు సబ్బులను కాకుండా ఏకంగా గాడిద పాలనే తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ క్రమంలోనే ఒక్క లీటర్ గాడిద పాలను రూ.1వేయి పెట్టి మరీ కొంటున్నారని తెలిసింది. కాగా గాడిద పాలను తాగడం వల్ల లైంగిక సమస్యలు పోతాయని, ఆస్తమా, ఆర్థరైటిస్, షుగర్ సమస్యలు తగ్గుతాయని అధిక శాతం మంది విశ్వసించి ఆ సమస్యల నుంచి బయట పడేందుకు గాడిద పాలను తాగుతున్నారట. ఏది ఏమైనా ఇప్పుడీ గాడిద పాల సబ్బులు మాత్రం నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.