telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

దిల్లీలో ఇందిరాగాంధీ.. సంబరాల్లో స్థానికులు..

delhi people see indira in priyanka

దిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను అబ్బురంగా చూస్తోంది… ఇందిరాగాంధీ మళ్లీ వచ్చారంటూ సంబరపడుతున్నారు. దేశ రాజధానిలో రోడ్‌షోల్లో పాల్గొంటూ… తమ పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ… ప్రియాంక తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తన నాయనమ్మను మరిపిస్తున్నారు. దక్షిణ దిల్లీ అభ్యర్థి విజేందర్‌సింగ్‌తో కలిసి ప్రియాంక రోడ్‌ షోలో పాల్గొన్నారు.

మెహ్రౌలీ-బదర్‌పుర్‌ రహదారిలో విరాట్‌ సినిమా దగ్గర నుంచి మొదలైన రోడ్‌ షో భారీగా తరలివచ్చిన అభిమానుల కారణంగా నెమ్మదిగా ముందుకు సాగాల్సి వచ్చింది. రోడ్‌షోలో ప్రియాంక పాల్గొనడం శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీ రంగులతో కూడిన వస్త్రాలు, విజేందర్‌సింగ్‌ చిత్రం ఉన్న టీషర్టులు ధరించిన కార్యకర్తలు భారీసంఖ్యలో హాజరై… ‘బాక్సర్‌భాయ్‌ జిందాబాద్‌… ప్రియాంక గాంధీ జిందాబాద్‌’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

పార్టీ నేత, మాజీ కౌన్సిలర్‌ ఓమ్‌వాటి మాట్లాడుతూ… ‘ఎదురుగా ప్రియాంక ఉన్నా… జ్ఞాపకాల పొరల్లో ఇందిర మెదిలారు’ అని ఆనందంగా చెప్పారు. ఇందిరాగాంధీ పాల్గొన్న ఎన్నో కార్యక్రమాలకు తాను హాజరైనట్లు… అచ్చం నాయనమ్మ మాదిరే ప్రస్తుతం ప్రియాంక ప్రసంగిస్తున్నారని, కలుపుగోలుతనాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆమె రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్‌ను మరింత శక్తిమంతం చేస్తోందని, ఎన్నికల్లో తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ఆయన వివరించారు.

ముఖంపై చిరునవ్వును చెదరనీయక మందుకు సాగుతున్న ప్రియాంక… ప్రచారానికి సరికొత్త కళ తెచ్చారని అభిమానులు సంతోషంగా చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు ప్రియాంక చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న తీరును చాలామంది తమ చరవాణుల్లో చిత్రీకరిస్తూ కనిపించారు. ‘కనిపిస్తోంది ప్రియాంక గాంధీ కాదు… మరో ఇందిరాగాంధీ’ అని మురిసిపోయారు.

Related posts