ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికన ఓ పోస్టు చేశారు వైఎస్ జగన్.. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది.” అంటూ ట్వీట్ చేశారు.
కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు ఈ ఉదయం చేరుకున్న జగన్, షర్మిల, వైఎస్సార్ భార్య విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్కు నివాళులు అర్పించిన వారిలో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు కూడా ఉన్నారు.