telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఎర్రబెల్లి లేఖ

Errabelli Trs

ఉపాధి కల్పనలో దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులతోపాటు, రావాల్సిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఎర్రబెల్లి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ రూపొందించిన అనేక పథకాలతోపాటు, 32 జిల్లాల్లో, 540 మండలాల్లోని 12,770 గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి రాసిన లేఖలో తెలిపారు.ఈ ఏడాది ఉపాధి పని దినాల లక్ష్యం 13.75 కోట్లు కాగా, 13.37 కోట్ల పనిదినాలను నిర్ణీత సమయానికి చాలా ముందే సాధించామన్నారు.అంటే 97.37శాతం లక్ష్య సాధనతో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి రాసిన లేఖలో తెలిపారు.

కరోనా సమయంలోనూ నగరాలు, పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వెళ్ళిన లక్షలాది మంది వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి కల్పించినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రావాల్సిన వాటా 1719.25 కోట్లకు గాను ఇప్పటి వరకు 694.66 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ఇంకా రావాల్సిన 1024.59 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞ ప్తి చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే పనులు పూర్తిచేసి బిల్లులు రాక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేసిన పనులతో ఉపాధి హామీ పథకం ఆశయాన్ని నెరవేరుస్తూ, లక్ష్యాలను సాధిస్తూ, దేశంలో నెంబర్ వన్ గా నిలుస్తూ, అవార్డులు పొందుతూ, ఉపాధి హామీలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ కి ఉపాధి హామీ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Related posts