స్వయం సహాయ సంఘాల రుణాలపైనా బ్యాంకులు దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయని 12.5,13.5 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నారని అన్నారు. మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సున్న వడ్డీకే రుణలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సీఎం జగన్ కోరారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని, ‘వైఎస్ నవోదయం’ కింద ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు చాలా తక్కువ అని, ప్రధాని ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలూ చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు.