ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవస్థలు నాశనమైతే ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం సరైన దిశలో ప్రయాణించకుండా ఆటంకాలు కలిగిస్తే రాష్ట్ర, దేశాభివృద్ధిలు ఆగిపోతాయని అన్నారు. అందువల్ల, రాజ్యాంగ వ్యవస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం పై, దాని కమిషనర్ రమేశ్ కుమార్ ‘కులం’పై జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల గురించి జగన్ మాట్లాడతారు తప్పితే, ‘కరోనా’ నివారణ చర్యల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు.విదేశాల నుంచి ఏపీకి వస్తున్న వారికి స్క్రీనింగ్ చేయించిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించుకోవాలో ఆలోచిస్తున్న జగన్, ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.