ఏపీలో నూతన విద్యావిధానం అమలు చేసే దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ముద్రిస్తోన్న పాఠ్యపుస్తకాలను నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుకలో స్పోర్ట్స్ షూ, స్పోర్ట్స్ డ్రెస్స్ ఇవ్వాలని నిర్ణయించారు. రెండోవ నాడు-నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సీఎం ఆదేశించారు. విద్యాశాఖలో నాడు-నేడు, ఫౌండేషన్ స్కూళ్లుపై సీఎం సమీక్షించారు. మంత్రులు, విద్యాశాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.
నూతన విద్యావిధానం అమలుపై అధికారులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపుపైనా సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ముందుగా 1000 పాఠశాలలను అఫిలియేషన్ చేస్తున్నామని సీఎంకు వివరించారు. అన్నిరకాల స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఐసీఎస్ఈ అఫిలియేషన్ మీద కూడా దృష్టిపెట్టాలన్నారు. కరోనా తగ్గుముఖం పట్టినందున వచ్చే ఏడాది పిల్లలు స్కూల్కు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఆడపిల్లలకు సానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబరులో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సమీక్షలో చర్చించిన మరిన్ని విషయాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు వివరించారు. ఎన్నికల హామీల్లో భాగంగానే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. రెగ్యులేటరీ కమిషన్తో ఫీజులు నిర్ణయించాక నాలుగు విడుతల్లో ఫీజులను చెల్లిస్తున్నామని తెలిపారు. పారదర్శకత కోసం ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని.. దీని ద్వారా కళాశాలలో నాణ్యమైన విద్య అందడంతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కళాశాలల ఖాతాలో జగనన్న విద్యాదీవెన నిధులు జమ చేయాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశాలపై సీఎం సమీక్షించారు. విద్యాదీవెనపై పూర్తి సమాచారంతో హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సీఎం నిర్ణయించారని.. పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరతామని తెలిపారు.