ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత దేశం పై పాకిస్తాన్ అట్టుడికిపోతుంది. దౌత్య, వాణిజ్య సంబంధాలతో పాటు ఇతరవ్యవహారాల్లోనూ కక్ష్యపూరిత నిర్ణయాలు తీసుకుంటోంది. చివరికి బక్రీద్ రోజున భారత బలగాలు మర్యాదపూర్వకంగా స్వీట్లు ఇస్తామన్నా తీసుకోలేదు. ఇరుదేశాలు తమ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు, వేడుకలు నిర్వహించే సమయంలో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది.
వాఘా-అటారీ సరిహద్దు వద్ద ఈ కార్యక్రమం ఓ ఉత్సవాన్ని తలపించే రీతిలో జరిగేది. ఆనావాయితీ ప్రకారం బక్రీద్ సందర్భంగా మిఠాయిలు తీసుకువస్తున్నామని బీఎస్ఎఫ్ అధికారులు పాక్ భద్రతా బలగాలకు సమాచారం అందించారు. అయితే, భారత్ నుంచి స్వీట్లు తీసుకోవాలా వద్దా అంటూ ఆ అధికారులు పాక్ ప్రభుత్వాన్ని కోరగా తీసుకోవద్దు- తిరస్కరించండి అని సూచించింది.