హైదరాబాద్ నగరంలో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. నగరంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగర వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూతో బాగ్యనగరం బోసిపోయింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు నిలిపివేశారు. ఆటోలు, క్యాబులు అర్ధరాత్రి నుంచి రోడ్డెక్కలేదు. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంగణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మద్యం దుకాణాలను, షాపింగ్ మాల్స్ ను మూసివేశారు. దేశ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే రైళ్లు నిలిపోయాయి. అత్యవసర సేవల కోసంహైదరాబాద్ నగరంలో డిపోకు 5 బస్సులను, అదేవిధంగా మెట్రో రైలు సర్వీసులను ఐదింటిని అధికారులు అందుబాటులో ఉంచారు. పారిశ్రామిక సంస్థలూ జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించాయి. జనతా కర్ఫ్యూకు సింగరేణి సంస్థ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా బొగ్గు గనులను బంద్ చేశారు.