తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు.
ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవీఎస్వోగా పనిచేసిన సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. స్వయంగా సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు.
డిసెంబరు 2వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఏవీఎస్వో సతీశ్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం లోతుగా విచారణ జరుపుతోంది.
సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో అప్పటి తితిదే వీజీవో గిరిధర్, ఏవీఎస్వో పద్మనాభంను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
చోరీ సమాచారం ఎవరికిచ్చారు? సతీశ్ కుమార్పై ఏమైనా ఒత్తిడి ఉందా? వంటి వివరాలను ఆరా తీసినట్లు తెలిసింది.
తాజాగా భూమన కరుణాకర్రెడ్డికి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

