ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు చెరువును కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. జిల్లాలోని కారుమంచి ప్రాంతంలో వైసీపీ నేతలు చెరువును కబ్జా చేస్తున్నారని కన్నా లేఖలో ఆరోపించారు. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు విజయభాస్కర్ రెడ్డి, రమణ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కీలకమైన ఈ చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కన్నా విజ్ఞప్తి చేశారు. అలాగే గోదావరి వరదల సందర్భంగా నష్టపోయిన ప్రజలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతూ మరో లేఖ రాశారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.