మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ ఎవర్గ్రీన్ హీరో.. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఖైదీ 150 తరువాత సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి, వరుస సినిమాలో జోరు అందుకున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు.
ఈ సినిమా తర్వాత అటు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన “లూసిఫర్” సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ కు దర్శకుడిగా ఇది మొదటి సినిమానే. పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కూడా పోషించడం విశేషం.
ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ కాబోతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించనుండగా…మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. చిరు కెరీర్లో 153వ మూవీగా రాబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.
ఈరోజు ఉదయం ఈ సినిమాకు సంబంధించిన పవర్పుల్ యాక్షన్ సీన్ చిత్రీకరించినట్లుగా దర్శకుడు మోహన్ రాజా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. షూటింగ్ లోకెషన్లో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్, స్టంట్ మాస్టర్ సిల్వతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా కన్ఫార్మ్ చేశాడు మోహన్ రాజా.
ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్వీఆర్ సినిమా సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఆర్.బి. చౌదరి- ఎన్.వి.ప్రసాద్ – పరాస్ జైన్, వాకాడ అప్పారావ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమా షూటింగ్ కి సంబంధించిన పనులు వేగవంతం చేశారు.. ఆచార్య చివరిదశకు వచ్చినట్టు తెలుస్తోంది. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. దీంతో కాజల్ చిరు పక్కన రెండోసారి ఛాన్స్ కొట్టేసింది.