తూర్పు లడఖ్లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో చైనాకు చిక్కిన 10 మంది భారత సైనికులను ఆ దేశం వదిలిపెట్టింది. వారిలో ఇద్దరు మేజర్లు కూడా ఉన్నారు. సోమ, మంగళవారాల్లో లఢఖ్ తూర్పు ప్రాంతంలోని గల్వాన్ నదీ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 76 మంది గాయపడ్డారు. చైనా వైపు ఎంతమంది సైనికులు కోల్పోయారనే విషయాన్ని ఆ దేశం అధికారికంగా వెల్లడించకపోయినా, 35 మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి.
ఘర్షణల సందర్భంగా 10 మంది భారత సైనికులు చైనా బలగాలకు చిక్కారని, ఇరుదేశాల మేజర్ జనరల్ల స్థాయిలో మూడు రోజులపాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం చైనా సైన్యం గురువారం సాయంత్రం వారిని విడిచిపెట్టిందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి ఆర్మీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా, గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల సందర్భంగా భారత సైనికులు ఎవరూ మిస్ కాలేదని ఇండియన్ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు.