రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. బ్రహ్మ దేవునికి ఆలయాలు అరుదు, ఆయన మగవాడు అయినప్పటికీ ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్కన ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. అందువలన సరస్వతి దేవికి ఆగ్రహం వచ్చి, ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ కాదని వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని శపిస్తుందట. అందుకే ఆ ఆలయానికి మగవాళ్ళు వెళ్లరు.
దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఒకటైన కన్యాకుమారిలో ఉన్న దేవీ ఆలయంలో ప్రధాన దేవత దుర్గా మాత అమ్మవారిని భాగతీమాతగా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు.
కేరళలో వున్న చెంగన్నూర్ భగవతీ ఆలయం. ఇక్కడ అమ్మవారు ప్రతి నెల ఋతుస్రావాన్ని ఆచరిస్తుంది. శివ పార్వతులు కొత్తగా పెళ్ళైన సమయంలో చెంగన్నూర్ ను సందర్శించారట. ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారుతుందట. అమ్మవారు రుతుస్రావం ఆచరించారని తెలుసుకొని గుడిని ప్రతి నెల మూడు రోజుల పాటు మూసేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. నాలుగోరోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారట. కేరళ రాష్ట్రంలో ఉన్న అట్టుకల్ దేవాలయంలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ఈ ఆలయానికి ఒక్క మగాడూ కూడా వెళ్ళరు, కాదని వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన. అంతేకాదు ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఇదే కేరళ రాష్ట్రంలో దుర్గా దేవి కొలువై ఉండే చక్కులాతుకవు దేవాలయం. ఇక్కడ ప్రతీ సంవత్సరం వారం రోజులపాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్ళు ఉండరాదట.
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో, మాతా ఆలయంలో వున్న అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు, మగవారిని అనుమతించరట. చూసారుగా మగవారికి అనుమతి లేని ఆలయాలను..మహిళలకే కాదు కట్టుబాట్లు మగవాళ్లకు కూడ అని దీని బట్టి అర్ధం అవుతుంది కదా !