వినాయక చవితి ఉత్సవాలకు ఆంక్షలు ఏవిధంగా పెడతారు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా వర్తిస్థాయని ఏపీ సీఎం జగన్ తీరును నిలదీశారు. తెలంగాణలో అనుమతించినప్పుడు.. ఏపీలో ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనా సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, వినాయక చవితి వేడుకల నిర్వహణ తదితర అంశాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత మహిళలకు న్యాయం కోసం ఈనెల 9న నర్సరావుపేటలో నిరసన తెలుపుతామని ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే 175 నియోజకవర్గాల్లో ఈనెల 10న చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం తీశారు. జగన్రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
మద్యం నిషేధంపై మహిళలతో కలిసి ఉద్యమించాలని తీర్మానించామని ప్రకటించారు. దశలవారీ మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ రెడ్డి.. ప్రజలను మోసం చేశారని … ధరల పెంపుతో పాటు నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు .
అలాగే ..లేని దిశ చట్టాన్ని ఉన్నట్లుగా జగన్రెడ్డి ప్రజలను భ్రమింపజేశారని, దిశ చట్టం ఎక్కడ ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో రోజు రోజుకీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని .. కమీషన్ల కోసం విద్యుత్ ను బయట నుంచి కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.