telugu navyamedia
తెలంగాణ వార్తలు

మూసీలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న మృతదేహం..

గులాబ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. చాదర్‌ఘాట్‌, వద్ద వంతెనను ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌ వంతెనతో పాటు చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు.

మూసీ పరీవాహక ప్రాంతాలకు చిన్నారుల రావొద్దని హెచ్చరించారు. చాదర్‌ఘాట్‌, శంకర్‌నగర్‌ ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షణలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కోఠి-చాదర్‌ఘాట్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

హిమాయత్ సాగర్ జలాశయంలో రెండు అడుగుల మేర ఎనిమిది గేట్లు ఎత్తిన జలమండలి అధికారులు 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గండిపేట్ జలాశయం ఆరు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. హిమాయత్ సాగర్, గండిపేట్ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరించారు.

మరోవైపు మూసారాంబాగ్‌ వద్ద మూసీ నదిలో డెడ్‌బాడీ కలకలం సృష్టించింది. మూసీలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న మృతదేహం వెలుగు చూసింది. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో మృతదేహం వెలికితీతకు అడ్డంకి ఏర్పడింది.

Related posts