గత కొంతకాలంగా దేశ మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఏ బ్రాండ్ వంట నూనె అయినా లీటర్ రూ.150కు తక్కువగా లేదు. వంట నూనెల ధరల వినియోగదారులపై పెను భారాన్ని మోపుతున్నాయి.ఏడాది కాలంలోనే వంట నూనెల ధరలు 20 నుంచి 50 శాతం వరకు ఎగబాకాయి. ఈ ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై ఎక్కువగా పడుతోంది.
ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి.. వంట నూనె వంటి నిత్యావసర సరకుల ధరలు పెడగడం మరింత భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరలు తగ్గించే క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వంట నూనెల ధరలను తగ్గించేందుకుగానూ… వ్యాపారుల వద్ద నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. పరిమితులు మార్చి 2022 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ఆహార, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఈ వస్తువులపై స్టాక్ పరిమితులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్సీడీఈఎక్స్ ప్లాట్ఫామ్పై..మస్టర్డ్ ఆయిల్ ట్రేడింగ్ను అక్టోబర్ 8 నుంచి నిలిపివేశారు.
కేంద్రం తాజా నిర్ణయంతో దేశీయ మార్కెట్లలో నూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఊరట కలిగించే విషయం’ అని ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.