బ్రిటన్లో కరోనా వైరస్ ఉదృతి రోజురోజుకూ పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న ఒక్క రోజే అక్కడ 708 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో ఒకే రోజు ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. మృతుల్లో ఐదేళ్ల బాలుడు ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక, దేశ్యాప్తంగా ఇప్పటి వరకు 41,903 మంది వైరస్ బారిన పడగా 4,313 మంది మృతి చెందారు.
నిన్న ఒక్కరోజే బ్రిటన్ వ్యాప్తంగా 3,735 కేసులు నమోదు కావడంతో అక్కడి పరిస్థితి దారుణంగా మారింది. నిన్న మరణించిన వారిలో 40 మందికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. దేశంలో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారులను ఆదేశించారు.