telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి..హైదరాబాద్‌లో మూడు రోజు మోదీ, అమిత్ షా బ‌స‌..

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణాకు క్యూ క‌ట్ట‌డంతో తెలంగాణ పాలిటిక్స్ జోరందుకున్నాయి.

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కానున్నట్లు సమాచారం. నగరంలోని హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌ హోటల్‌లో సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పార్టీ నాయకులు సమీక్షిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, తెలంగాణ ఇన్‌ చార్జ్ తరుణ్ చుగ్‌తో పాటు రాష్ట్ర నాయకులు.. మాదాపూర్ హెచ్‌ఐసీసీని పరిశీలించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే అతిథుల కోసం హైటెక్స్, ఇతర హోటళ్లు, రిసార్టులను పరిశీలిస్తున్నారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో సంతోష్ సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి ఆయన చర్చించనున్నారు.

ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా,పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. స‌మావేశంలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు మూడు రోజుల పాటు నగరంలోనే బస చేయనున్నారు.

అంతేకాకుండా తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండాను ఎగరవేయాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం.. వ్యుహాత్మకంగానే జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.

మరోవైపు తొలిసారిగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను కేంద్రప్రభుత్వం నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 8ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ‌శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం జరగనుంది. ఈ వేడుకలకు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 

Related posts