telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెవెన్యూ వ్యవస్థ… రైతుల పాలిట శాపంగా మారింది : విజయశాంతి

తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. “తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ అంత రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పడానికి గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలే నిలువెత్తు సాక్ష్యాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్ కార్యాలయం గుమ్మానికి తాళిబోట్టు వేలాడదీసింది. అంతకుముందు మెదక్ జిల్లా తాళ్ళపల్లి తండాలో మరణించిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్‌బుక్ రాకపోవడంతో ఆ కుటుంబానికి రైతుబీమా పరిహారం, రైతుబంధు అందలేదని శివ్వంపేటలోని తహసీల్దారు కార్యాలయం వద్ద తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతి పత్రికలోనూ, చానెల్‌లోనూ ఈ సంఘటనలే ప్రధాన అంశాలుగా కనిపించాయి. రాష్ట్రమంతటా రైతులకు ఇలాంటి అనుభవాలు దాదాపు ప్రతిరోజూ ఎదురవుతూనే ఉన్నాయి. ఇవి చాలదన్నట్టు ఏదో కొద్దిమంది రైతులకు అరకొరగా రైతుబంధు డబ్బులు అందినా అవి కాస్తా పాతబాకీల కింద బ్యాంకులు జమ చేసుకునే పరిస్థితి. కేసీఆర్ సర్కారు సక్రమంగా రుణమాఫీ చేసి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురై ఉండేది కాదు. ఇవిగాక నకిలీ విత్తనాల సమస్య, పంట కొనుగోళ్ళ ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఆ పైన భూ సమస్యల పరిష్కారానికి సర్వరోగ నివారిణి అంటూ సర్కారు వారు గొప్పగా చెప్పుకునే ధరణి వెబ్ సైట్ సవాలక్ష సాంకేతిక సమస్యలతో రైతులతో పాటు ప్రజలందరినీ ముప్పుతిప్పలు పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.” అంటూ విజయశాంతి మండిపడ్డారు.

 

 

Related posts