మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెనుదుమారాన్ని లేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను పలువురు సొంత పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. తాజాగా సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఆమె వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధ్వి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ అంగీకరించదని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యల విషయమై పార్టీ హైకమాండ్ వివరణ కోరుతుందని తెలిపారు. ఈ వ్యవహారం పై ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ కోరారు.
మరో వైపు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జీవీఎల్ మండిపడ్డారు.పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న హింసకు ఆమే కారకురాలని అన్నారు. ఆమెపై తాను ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈసీ సరైన చర్యలు తీసుకోలేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వ్యక్తి మమత అని విమర్శించారు. బీజేపీపై మమత, మాయావతి అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.