డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వినియోగంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ హానికరమని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. వైద్యపరంగా, మానసికంగా హానికరమని తెలిపింది. డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ వాడొద్దని అందరికీ చెప్పామని కేంద్రం పేర్కొంది. హానికరమైనప్పుడు ఎందుకు నిషేధం విధించలేదన్న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం సరైన ఆదేశాలు జారీ చేస్తుందని ఎస్జీ మెహతా తెలిపారు. కాగా డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్పై రేపు కేంద్రం నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్త్రృత స్థాయిలో ఈ రకమైన టన్నెల్స్ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనావైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో అది రాకుండా ఉండేందుకు రాష్ట్రాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో ‘కరోనా డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్’ (Corona Disinfection Tunnel) ఏర్పాటు చేశారు. సుమారు 16 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఈ టన్నెల్ నిర్మించారు. దానికి రెండు సెట్ల స్ప్రేయర్లను అమర్చారు. ఇలా అమర్చిన ఒక్కో సెట్కు మూడు నాజిల్స్ ఉంటాయి. వాటి ద్వారా కరోనా వైరస్ను నాశనం చేసే ‘సోడియం హైపోక్లోరైట్’ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కాగా మార్కెట్కు వచ్చేవారంతా ముందు అక్కడ ఏర్పాటుచేసిన వాష్బేసిన్ల వద్ద సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఆ తరువాత ఈ టన్నెల్ గుండా చేతులు రెండు పైకెత్తి నడుచుకుంటూ వెళ్లాలి. వారిపై సుమారు ఐదు సెకన్లపాటు హైపోక్లోరైట్ ద్రావణం వెదజల్లుతారు. ఇలా చేయడం వల్ల శరీరంపై కరోనా వైరస్ ఏమైనా వుంటే చనిపోతుంది. దానిని ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ 1 పీపీఎం (పార్ట్స్ పెర్ మిలియన్)తో తయారుచేశారు. కాగా ఒక టన్నెల్ తయారీకి సుమారు రూ.90 వేలు ఖర్చు అయింది. ఈ మొత్తానికి వేయి లీటర్ల ద్రావణం వస్తుంది. దాంతో 16 గంటల పాటు నిరంతరం పిచికారీ చేయవచ్చు. గంటకు 50 లీటర్లు వినియోగమవుతోంది.
previous post